Topic: Rajakiya vankaya (రాజకీయ వంకాయ )
Language: Telugu (తెలుగు)
Published on: Feb 08, 2010
Rajakiya vankaya (రాజకీయ వంకాయ )
మాయాబజార్ లో పింగళిగారు శాకంబరీ వరప్రసాదంగా గోంగూరని అభివర్ణించారుగాని- నా దృష్టిలో ఆ గౌరవం- ఇంకా చెప్పాలంటే మహా శాకంబరీ దేవి పూర్ణావతారంగా వంకాయని నేను పేర్కొంటాను.
పురుషులందు పుణ్యపురుషులలాగ కూరగాయలలో తలమానికం వంకాయ.వంకాయని విశ్వామిత్ర సృష్టి అంటారు. ఆ ఒక్క కారణానికే విశ్వామిత్రుడిని జగన్మిత్రుడిగా మనం కొలుచుకోవాలి. ఓ కవిగారు వంకాయ కూర తిని తిని, పరవశించి, తలకిందులై, కవితావేశంతో ఆశువు చెప్పాడు.
వంకాయ వంటి కూరయు
లంకాపతి వైరివంటి రాజును ఇలలో
శంకరునివంటి దైవము
పంకజముఖి సీతవంటి భార్యామణియున్
అంటూ క్రియముక్కని వదిలేశాడు. “లేరు లేరు లేరు” అని ఎవరికి వారు చెప్పుకోవాలని ఆయన ఉద్దేశం. మనదేశంలో ఉల్లిపాయకి కొరత వచ్చింది. బంగాళాదుంపకి కొరత వచ్చింది. చక్కెరకి కొరత వచ్చింది. కిరసనాయిలుకి కొరత వచ్చింది. పెట్రోలు కొరత ఉండనే ఉంది. కాని- ఏనాడయినా, ఏ రాష్ట్రం వారయినా వంకాయ కొరత వచ్చిందన్నారా? దీనిని బట్టి ఈ దేశంలో దేశభక్తిలాగే వంకాయ భక్తి సర్వవ్యాప్తమని గ్రహించాలి.
మనదేశంలో 200 పై చిలుకు వంకాయ రకాలున్నాయట. ఈ మాట వినగానే నా గుండె పగిలిపోయింది. నా జీవితంలో ఏ పది రకాల వంకాయనో తిన్న వాడిని. మిగతా రకాలు ఎప్పుడు తింటానా అని ఉవ్విళ్ళూరుతున్నాను. ఈ లోగా బీటీ వంకాయ విపత్తు వచ్చిపడింది. బీటీ వంకాయ అంటే కృత్రిమ గర్భోత్పత్తిలాగ, జన్యు బీజాలలోనే ప్రయోగశాలలో వంగ వంగడాలను తయారు చేసి అమ్ముతారట. నాకర్ధంకాని విషయం- ఈ దేశంలో రైతులకీ అర్ధంకాని విషయం- ఉన్న మొగుడొకడుండగా బావ మొగుడెందుకని?
అయ్యా, ఈ దేశంలో గొప్ప వస్తువులన్నీ- విచిత్రంగా “మనవి” అని చెప్పుకోవాలన్న ఆలోచన మనకి లేదు. ఆ ప్రయత్నం అవసరమని కూడా మనకి తెలీదు. శతాబ్దాలుగా బస్మతీ బియ్యాన్ని మనం సాగుచేస్తున్నా- ఆవుల్నీ, మేకల్నీ, ఆఖరికి మనుషుల్నీ కాల్చుకు తినే అమెరికా వారు బస్మతీ బియ్యాన్ని పేటెంటు చేశారు.
మనలో చాలామందికి తెలీదు. గర్వపడడం అసలు తెలీదు. మనకి పొరుగింటి పుల్లకూర- అది మురిగినా, కుళ్ళినా మనకి రుచి. వేద కాలం నుంచే నిలదొక్కుకుని ఉన్న జ్యోతిష శాస్త్రం మన దేశంలో ఉండగా జాతకాలు వేసే సాఫ్టు వేర్ ఒక అమెరికా సంస్థ కంఫ్యూటర్ల లోకి ఎక్కించగా ఒక జైపూర్ సంస్థ దాన్ని వితరణ చేసి కోట్లు సంపాదిస్తోంది. మన దరిద్రం ఏమిటంటే మనకి జ్యోతిషం మీద నమ్మకం లేదు. అమెరికా వారికి వ్యాపారం మీద నమ్మకం ఉంది.
ముందు ముందు భగవద్గీత, బాదం పప్పు, ఖద్దరు లుంగీ, ఆవుపేడ పిడకలు అమెరికావారు పేటెంటు చేస్తే మనం ఆనందంగా దిగుమతి చేసుకుంటాం.
ఘనత వహించిన మన నాయకమ్మణ్యులు- ముఖ్యంగా జయరాం రమేష్ వంటి కేంద్ర మంత్రి వరేణ్యులు అమెరికాలో మొన్సానో అనే సంస్థ కొన్ని మిలియన్ల పెట్టుబడితో దిక్కుమాలిన వంకాయ వంగడం తయారు చేస్తే దాన్ని ఈ దేశంలో ప్రవేశ పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇందువల్ల ఎన్ని వందల కోట్లు ఎన్ని జేబులు మారుతాయో భగవంతుడికెరుక.
No comments yet.